
హైదరాబాద్, వెలుగు: జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ లో జరుగుతున్న అక్రమ నిర్మాణలను నిలిపివేయాలని హైకోర్టు స్టే ఆదేశాలను జారీ చేసింది. జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో కొనసాగుతున్న అన్ని నిర్మాణాలను నిలిపివేయాలని గురువారం ఆదేశాలు వెలువరించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు గతంలో మౌఖికంగా ఆదేశించిన తర్వాత కూడా నిర్మాణాలు కొనసాగడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ పి. వేణుగోపాల్ దాఖలు చేసిన పిటిషన్ను గురువారం జస్టిస్ విజయ్సేన్రెడ్డి విచారించారు. జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ పాలక మండలిపై చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపడుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ యాజమాన్యం భవన నిర్మాణ అనుమతి పొందకుండానే అక్రమంగా నిర్మాణం చేస్తుందని, జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవడం లేదని, అక్రమ నిర్మాణాలు చేయడాన్ని ఫొటో తీసిన పిటిషనర్పై పోలీసు కేసు పెట్టారని కోర్టుకు న్యాయవాది చెప్పారు. భారీ భవనాన్ని అనుమతి లేకుండా ఎలా నిర్మిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలను కొనసాగించకుండా స్టే ఆదేశాలు జారీ చేసింది. విచారణను వచ్చే నెల 3కి వాయిదా వేసింది.
కుంటిసాకులు చెప్పొద్దు
అక్రమ నిర్మాణాలపై తక్షణం చర్యలు తీసుకోకుండా కుంటిసాకులు చెబుతారా అంటూ నల్గొండ మున్సిపల్ అధికారులపై హైకోర్టు గురువారం మండిపడింది. కూల్చివేత ఉత్తర్వులు 2022లో జారీ అయినా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. పరస్పర లేఖలతో కాలయాపన చేయకపోతే తక్షణం ఎందుకు చర్యలు తీసుకోలేరని సీరియస్ అయింది. నల్గొండ గొల్లగూడలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చివేయాలంటూ 2022లో మున్సిపల్ కమిషనర్ ఆదేశాలిచ్చినా అధికారులు వాటిని అమలు చేయలేదు.
దీంతో 83 ఏళ్ల కె.రాములమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్సేన్ రెడ్డి విచారణ చేపట్టగా మున్సిపాలిటీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ విద్యుత్తు, నీటి సరఫరా నిలిపివేతకు లేఖలు రాశామని చెప్పారు. అలాగే కూల్చివేత చర్యలు చేపట్టాలని ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి కూడా లేఖ రాశామని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. అక్రమ నిర్మాణానికి విద్యుత్తు, నీటి సరఫరా నిలిపివేయాలని, ఈ దిశగా తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ చర్యలకు సంబంధించిన నివేదికను సమర్పించాలని సూచించారు. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేశారు.